కాప్రా, నవంబర్ 29 : జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం స్వీప్ కార్యక్రమంలో భాగం గా కాప్రాలోని అనీష్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధంతో సమానమని, దీనివల్ల ప్రజాస్వామ్యబద్దంగా ఓట్లు వేసి నాయకులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తప్పకుండా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదుకు సంబంధించి బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి గతంలో ఓటర్లుగా లేనివారి పేర్లను నమోదు చేస్తున్నారని, వారికి సహకరించి ఓటు హక్కులేనివారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఆయా పోలింగ్ బూత్ల వద్ద డిసెంబర్ 3,4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్ర మం చేపడుతున్నామని, బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదుతో పాటు సవరణలు, మార్పులు, చేర్పులు , తొలగింపులు చేస్తారని అన్నారు. డిసెంబర్ 8లోగా నూతన ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసేవిధంగా చూడాలని అదనపు కలెక్టర్ నర్సింహరెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు ఫారం -6, 6బీ, గరుడ యాప్ల గురించి కళాశాల విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాసమూర్తి, కాప్రా సర్కిల్ డీసీ శంకర్, కాప్రా తాసీల్దార్ అనిత, బూత్ లెవల్ అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
కాప్రా సర్కిల్లో 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ల నమోదు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్కిల్లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి కొత్త ఓటర్ల నమోదు కార్యాచరణపై ఇప్పటికే సమావేశాలు నిర్వహించి.. అవగాహన కలి పించారు. క్షేత్రస్థాయిలో కళాశాలలు, మాల్స్, వ్యాపార సంస్థల వద్ద కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అంతే కాకుం డా కాలనీల్లో ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలకు మైక్లను ఏర్పాటుచేసి, వాటి ద్వారా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై అవగాహన చేపడుతున్నారు. వార్డు కార్యాలయాలు, పోలింగ్ బూత్ల వద్ద ప్రతి శని, ఆదివారాలు బూత్లెవల్ అధికారిని అందుబాటులో ఉంచి.. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డీసీ శంకర్ తెలిపారు.