సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : సనత్నగర్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభించనున్నారు. చుట్టు పక్కల బిల్డింగ్లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో కూల్చివేయనున్నారు.
డైమండ్ కటింగ్తో ఒకేసారి భవనం కూప్పకూలకుండా, ఒకవైపు ఒరగకుండా కూల్చివేయడం ఈ యంత్రం ప్రత్యేకత. కూల్చివేత ప్రక్రియలో భాగంగా బుధవారం టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. రూ.33.86 లక్షల అంచనా వ్యయంతో టెండర్ను పిలువగా, నగరానికి చెందిన ఎస్కే మల్లు ఏజెన్సీకి రూ. 25.94 లక్షలకు పనులను అప్పగించారు. వారం నుంచి పది రోజులలో డెక్కన్ మాల్ భవనాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.