కొండాపూర్, డిసెంబర్ 14 : చేనేత హస్తకళాకారులకు చేయూతనిచ్చేందుకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తేదీ నుంచి ఆలిండియా క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం కానున్నట్లు శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య గురువారం శిల్పారామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చేనేత, హస్తకళాకారులకు చేయూతనందించేందుకు ప్రతి సంవత్సరం నిర్వహించే క్రాఫ్ట్స్ మేళాను ఈ ఏడాది యథావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15 నుంచి 31వ తేదీ వరకు మేళా కొనసాగుతుందని, నగరవాసులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మేళాలో సందర్శకులకు ప్రత్యేక ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రతి రోజు సాయంత్రం కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.