సిటీబ్యూరో, జులై 21(నమస్తే తెలంగాణ)/ బేగంపేట: విద్యార్థులు నాయకత్వ లక్షణం అలవర్చుకోవడంతో పాటు జవాబుదారితనాన్ని కచ్చితంగా పాటించాలని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ధి వేడుకల్లో భాగంగా శుక్రవారం బేగంపేటలోని హెచ్పీ స్కూల్లో ‘విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల అప్పగింత’ (ఇన్వెస్టిచర్ సెర్మనీ)పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఆయన సతీమని నీత చౌదరితో సహా హాజరవగా, గౌరవ అతిథిగా హెచ్పీఎస్ పూర్వ విద్యార్థి, హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ లార్డ్ కరణ్ బిలిమోరియా విచ్చేశారు. విద్యార్థులను ఉద్దేశించి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ, అంకితభావం, చిత్తశుద్ధితో పాటు నాయకత్వ విలువలను పెంపొందంచుకునేందుకు కృషి చేయాలన్నారు. ప్రపంచానికి నైతికత, దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమని, నిరంతర అభ్యసనంతో నైపుణ్యాలను పెంపొందించుకొని నాయకత్వ లక్షణాలను మెరుగుపర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
హెచ్పీఎస్ పూర్వ విద్యార్థి-హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ లార్డ్ కరణ్ బిలిమోరియా మాట్లాడుతూ, విద్యా రంగంలో ఉత్తమమైన విద్యావిధానంతో సమర్థవంతమైన భవిష్యత్తును కలిగిన యువతను హెచ్పీఎస్ తీర్చిదిద్దుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, గర్ల్స్ విభాగాలకు చెందిన 152 మంది ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై వేడుకలను తిలకించారు. ఆద్యంతం వేడుకలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎపీఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ ఆర్.రఘురాంరెడ్డి, హెచ్పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తినోరియా, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పాఠశాల ప్రిన్సిపాల్ స్కంద్ బాలి తదితరులు హాజరై ప్రసంగించారు.