మారేడ్పల్లి : ప్రభుత్వ పాఠశాలలను సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పశుసంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్, డిజిటల్ లైట్రరీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హెచ్చార్డీ సమావేశంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ఇప్పటికే పలు మార్లు సంబంధిత అధికారులతో కలిసి ఈ పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు. పాఠశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంకల్పించి దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యాపార వేత్త హిమాన్షు సహకారంతో సమకూర్చిన 2 లక్షల రూపాయాల విలువ చేసే ఆర్వో ప్లాంట్, 5 లక్షల వ్యయంతో మరో దాత సమకూర్చిన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించడం జరిందన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.
త్వరలో మరో దాత సుశీల్జైన్ సహకారంతో 4 లక్షల రూపాయాల వ్యయంతో టాయిలెట్ల నిర్మాణ పనులు, డైయినింగ్ హాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నామని చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 2 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. ఈ నిధుల నుంచి పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భం గా మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత మాట్లాడుతూ… కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని గతంలో పోల్చితే పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్ల ను చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్రెడ్డి, హైదరాబాద్ జిల్లా డీఈవో రోహిణి, మారేడ్పల్లి మండల విద్యాధికారి యాదయ్య, మారేడ్పల్లి మండల ఉప పర్యావేక్షణ అధికారి ప్రసన్న, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, నాయకులు టిఎన్ శ్రీనివాస్, ఆకుల హరికృష్ణ, ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.