వ్యవసాయ యూనివర్సిటీ: పెండింగ్లో ఉన్న తమ ఇంక్రిమెంట్స్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (టాసా) సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీసీ భవనం వద్దకు చేరుకుని సంబంధిత అధికారి రీసెర్చ్ డైరెక్టర్ డా.బలరామ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. న్యాయమైన డిమాండ్ల కోసం కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరిగినా.. ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉందని సాకులు చెబుతూ కాలయాపన చేశారన్నారు.
ఇంక్రిమెంట్లపై ఎంత జాప్యం చేస్తే తమ ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. 2016 ఏడాది జీవో 15 ప్రకారం ఎంఎస్సీ(అగ్రి, హార్టికల్చర్), ఎంటెక్ (అగ్రి ఇంజినీరింగ్) తదితర పీజీ పూర్తిచేసిన అధ్యాపకులకు, శాస్త్రవేత్తలకు మంజూరైన రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ను ఉపసంహరించడం, రికవరీ చేయడం తగదన్నారు. టాసా ప్రధాన కార్యదర్శి డా.సౌజన్య, ఉపాధ్యక్షులు కమలాకర్, ప్రశాంత్, డా.రాకేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.