Rachakonda | సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రోడ్లపై మహిళలను వేధించినా పట్టించుకునే వారు లేరు.. మద్యం దుకాణాల ముందు సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు.. వాహనాలు పార్కు చేసి, రోడ్లు బ్లాక్ చేస్తున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో పోకిరీలు, మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. సాయంత్రం అయ్యిదంటే చాలు.. మద్యం దుకాణాల వద్ద వాహనాలు బారులు తీరి ఉండటం.. మందు బాబులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి ఉంటుంది. మందు బాబులు తిష్టవేసే ఆ ప్రాంతం నుంచి మహిళలు నడుచుకుంటూ వెళ్లారంటే ఇంకేముందు ఇష్టానుసారంగా కామెంట్ చేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన పెట్రోలింగ్ సిబ్బంది ఎక్కడా కనిపించరు.. ఈవ్టీజింగ్ను అరికట్టాల్సిన షీ టీమ్స్ ఉన్నాయో.. లేదో అన్నట్లుగానే వారి పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు సర్వీస్రోడ్లు, మెయిన్ రోడ్ల వైపు చూడరు. మహిళలు, సామాన్య వాహనదారులు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్నా.. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
మద్యం దుకాణాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు, శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు అప్పుడప్పుడు వస్తూ.. ఉంటాయి. రాత్రి దుకాణాలు మూసే సమయంలో చూసీచూడనట్లుగా ఉండేందుకు.. ఆయా మద్యం దుకాణాల యాజమాన్యాలు స్థానిక పోలీసులతో నెలవారీగా మామూళ్ల ఒప్పందాలు చేసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలకు గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఒకసారి అలా వెళ్లి.. చూసి చూడనట్లు రౌండ్ కొట్టేసి వెళ్తుంటారు. ఆ తరువాత అటూ వైపు చూడరు. శాంతి భద్రతల పోలీసులు పెట్రోలింగ్ వాహనాలు కూడా అటు వైపు వెళ్లవు. అలాగే, రాత్రి 11 గంటల తరువాత కూడా పెట్రోలింగ్ వాహనాలు అటుగా వెళ్లినా.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
బస్టాండ్లు, మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉండే మద్యం దుకాణాల వద్ద సాయంత్రం నుంచి రాత్రి వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటు నుంచి కాలనీవాసులు, విద్యార్థులు, ఉద్యోగులు నడుచుకుంటూ వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిచోట్ల రోడ్ల మధ్యనే మద్యం బాటిళ్లతో పోకిరీలు హంగామా చేస్తుంటారు. అటు వెళ్లేవారిని సూటిపోటీ మాటలు, వెకిలి చేష్టలతో ఇబ్బందులు గురిచేస్తుంటారు. అయితే, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు సాయంత్రం వేళల్లో బయటకు వచ్చి.. తిరిగి సర్వీస్ రోడ్ల నుంచి వెళ్లాలంటే భయపడాల్సి వస్తున్నది. అయితే, షీ టీమ్స్ మాత్రం ఇటూ వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.
సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మెట్రో స్టేషన్కు సమీపంలో ఉన్న రెండు మద్యం దుకాణాల వద్ద సాయంత్రం అయ్యిందంటే సర్వీస్ రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి. పరిసర ప్రాంతాల్లో ఉండే ఉమెన్ హాస్టళ్లు, కాలనీలకు వెళ్లేవారు, సినిమాలకు, షాపింగ్స్కు వెళ్లే వారితో రద్దీగా ఉంటుంది. అయితే, అక్కడ మహిళలను ఈవ్టీజింగ్ చేస్తూ పోకిరీలు తిష్ట వేస్తుంటారు. ఫుట్పాత్పై టిఫిన్ సెంటర్లుంటాయి. అక్కడికి కూడా ఫ్యామిలీతో వస్తుంటారు. అలాంటి వారిని సైతం వదిలిపెట్టడం లేదు. అలాగే, కర్మన్ఘాట్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.
చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఉండే మద్యం దుకాణం వద్ద సర్వీస్ రోడ్లు బ్లాక్ అయి ఉంటాయి. ఇక్కడి బస్టాపులో ఆగాలంటేనే మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిలుకానగర్, రామంతాపూర్ ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాల వద్ద రోడ్లను బ్లాక్చేసి, వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. అటు నుంచి రాకపోకలు సాగించే వారు భయం భయంగా అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని వినాయక్నగర్ చౌరస్తా ప్రాంతంలో ఉన్న ఒక మద్యం దుకాణం వద్ద ట్రాఫిక్ రోడ్డు పైనే ఆగిపోతుంది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మల్కాజిగిరి ఠాణా పరిధిలోని చౌరస్తా వద్ద ఉన్న మద్యం దుకాణంతో ట్రాఫిక్ ఇబ్బందులను ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్నారు. కమిషనరేట్లోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఎదో ఓ మద్యం దుకాణం వద్ద ఇలాంటి పరిస్థితి నిత్యం కనిపిస్తుంది.