రవీంద్రభారతి, జనవరి 26 : అమృతం కన్నా ఎక్కువ తీయనైనది అమ్మదీవెన అని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. విశ్వజననీ పరిషత్ ట్రస్టు, జిల్లెళ్లమూడి అమ్మ శతజయంతి సందేశ సభ గురువారం రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, విశిష్ట అతిథిగా సహస్రావధాని పద్మశ్రీ డా. గరికపాటి నరసింహారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమ్మ శతజయంతి ప్రత్యేక తపాల కవరును పోస్టుమాస్టర్ జనరల్ పీ.వీ.ఎస్.రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ ట్రస్టు చైర్మన్ కే.నరసింహామూర్తి, బ్రహ్మాండం రవీంద్రరావు, ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారానాయణమూర్తి, విశ్వజననీ మాసపత్రిక సంపాదకులు, దర్శనం మాసపత్రిక సంపాదకులు ఎం.వీ.ఆర్ శర్మ, డీవీఎన్ కామరాజు తదితరులు పాల్గొన్నారు.