మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 5 : వచ్చే విద్యా సంవత్సరానికి వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశానికి గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను బోయినిపల్లిలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. అకాడమీలో కాయకింగ్, కెనోయింగ్, సెయిలింగ్ తదితర వాటిలో శిక్షణనిస్తారు.
ఎత్తు, బరువు, స్టాండింగ్ బ్రాండ్ జంప్, వర్టికల్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, 800 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించి, ప్రతిభ ఆధారంగా 5వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం కల్పించనున్నారు. 10 మంది బాలికలు, 10 మంది బాలురకు అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 1 నాటికి 9 నుంచి 11 ఏండ్లలోపు కలిగి ఉండి, ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న వారు ప్రవేశానికి అర్హులు. విద్యార్థులు ఈ నెల 12 వరకు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.