డ్రగ్స్కు బానిసగా మారి యువత మత్తులో తూగుతూ కుటుంబాలను చిన్నబిన్నం చేసుకుంటున్నారు. దీంతో తల్లిద్రండులు ఆందోళనకు గురవుతున్నారు. శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో కొంతకాలంగా సిగరెట్లలోనే మత్తు పదార్థాలు కలిపి అమ్ముతున్నట్లు సమాచారం. నర్కూడలోని మంగరాశీకుంట పరిసర ప్రాంతాల్లో యువత ఉదయం సాయంత్రం వేళల్లో సిగరెట్లు కాలుస్తూ మత్తులో జీవిస్తున్నారు. నర్కూడ గ్రామం కేంద్రంగా అమ్ముతున్న డ్రగ్స్ చుట్టు పక్కల గ్రామాలకు సైతం పాకింది. కవ్వగూడ, సుల్తాన్పల్లి, మల్కారం, కాచారం, చౌదర్గూడ, జూకల్ గ్రామాల్లోని యువతకు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. మంకరాశీకుంట సమీపంలో ఉన్న ఓ గదిలో అమ్ముతున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు పిల్లల కలయికలపై దృష్టి సారిస్తే మత్తు నుంచి విముక్తి కల్పించవచ్చు అంటున్నారు నిపుణులు. యువత భవిష్యత్ బుగ్గిపాలు కాకముందే తల్లిదండ్రులు మేలుకొని పిల్లల వ్యసనాలపై దృష్టిని కేంద్రికరించాలి.
గత సంవత్సరం మార్చి నెలలో లాక్డౌన్ ప్రారంభం కావడంతో ప్రజలు బయటికీ వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. అదే సమయంలో కొందరు అక్రమార్కులు మత్తు పదార్థాల విక్రయాలను ఆదాయ వనరుగా మార్చుకుని డ్రగ్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. వీరు టీనేజీ యువకులను ఎంచుకుని దందా చేస్తున్నారు. యువకులు ఒకరి నుంచి ఒకరు మత్తుకు అలవాటు పడి మత్తులో తూగుతున్నారు. దీం తో యువత యుక్త వయసులోనే ఆనారోగ్యం బారీన పడడంతో తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. యు వకులు ఈ మత్తుకు అలవాటుపడి వారి మిత్రులకు అలవాటు చేయడంతో వేలల్లో వ్యా పారం నడుస్తున్నట్లు స మాచారం. కొనుగోలు చేయడానికి మంకరాశీకుంట వద్దకు రాకుండా ఫోన్ ద్వారా కావాల్సినంత చేబితే వారికి వారు ఉన్నచోటకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మత్తుకు బానిసలుగా మారిన కొందరు యువత కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఆనారోగ్యంతో దవాఖానలో చేరి లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నట్లు గుసగులను వినిపిస్తున్నాయి. ఇప్పటీకైన సంబంధిత అధికారులు స్పందిం చి డ్రగ్స్ అమ్మతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
శంషాబాద్ మండలంలోని నర్కూడలో మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఎవరు అమ్ముతున్నారే అనే విషయంపై నిఘూ పెట్టాము. వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాం. శంషాబాద్ మండలంలోనే కాదు రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఎక్కడ డ్రగ్స్ అమ్మిన మాకు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. ఎవరు భయపడొద్దు, నిర్భయంగా సమాచారం ఇచ్చి సహకరించాలి. – ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, రాజేంద్రనగర్