ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 30 : మీడియాలో కొనసాగుతున్న వ్యక్తులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని, అప్పుడే వారు విజయవంతం అవుతారని తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. ఒకప్పుడు రేడియోతో మొదలైన మీడియా ప్రస్థానం గురించి వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో సీనియర్ ప్రొఫెసర్లు కె.స్టీవెన్సన్, కె.నరేందర్ పదవీ విరమణ సభను ఆర్ట్స్ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్రెడ్డి విభాగం తరఫున ముద్రిస్తున్న ఈ-జర్నల్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ‘ట్రాన్సిషన్ ఆఫ్ మీడియా పోస్ట్ – ఇండిపెండెన్స్’అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేడియా, వార్తాపత్రిక, టీవీ జర్నలిజం, లైవ్ కవరేజీలుగా మీడియా వేగంగా వ్యాప్తి చెందిందని అన్నారు. సోషల్ మీడియా ప్రవేశంతో మొత్తం పరిస్థితి మారిపోయిందని చెప్పారు.
పాతకాలంలో జర్నలిజంలో చేరిన వారు డిజిటల్ మీడియాకు మారడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ సాంకేతికతతో మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఆ మార్పులకు అనుగుణంగా మారకపోతే వెనకబడిపోయే ప్రమాదముంటుందని అన్నారు. తొందరలో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మంచి కంటెంట్ ఉంటే విజయం పొందవచ్చని చెప్పారు. సాధారణ వ్యక్తులు కూడా డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో విజయం పొందుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ స్టీవెన్సన్, ప్రొఫెసర్ నరేందర్ తనకు గురువులని అన్నారు. తన విజయంలో గురువుల పాత్ర ఎంతో ఉన్నదని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రొఫెసర్ స్టీవెన్సన్ను పరిశోధక విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, డాక్టర్ సతీశ్కుమార్, ఓయూ పీఆర్వో ప్రొఫెసర్ ప్యాట్రిక్, ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతిరెడ్డి, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.