సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్ : అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1గా నిలవడానికి నిత్యకృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ, యువజన, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో సోమవారం ఉదయం తెలంగాణ 2కే, 5కే రన్ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్లతో కలిసి మంత్రులు జెండాను ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ యువత రాష్ర్టానికి కీర్తి, ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. ఐటీ పారిశ్రామిక రంగాల్లో తెలంగాణతో దేశంలోని ఏ రాష్ట్రం పోటీ పడటం లేదని, ఇదే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత భాగస్వామ్యం వహించాలని కోరారు. అన్ని రంగాల్లో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను అత్యంత సమర్ధవంతంగా అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం స్ఫూర్తిగా తెలంగాణ రన్ను నిర్వహించుకోవడం గర్వకారణమని చెప్పారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ 9 ఏండ్లలో రాష్ట్రంలో జరిగిన అప్రతిహత అభివృద్ధిని మరోసారి ప్రజలకు వివరించేందుకు దశాబ్ది వేడుకలు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ వేడుకలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని తెలిపారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సురక్షిత నగరంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. దీంతోపాటు ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, అడిషనల్ డీజీలు విజయ్కుమార్, సంజయ్కుమార్ జైన్, స్వాతిలక్రా, ఐజీ రమేశ్రెడ్డి, ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ క్రీడాకారులు ఈషా సింగ్, సింగర్లు మంగ్లీ, రామ్, సినీనటి శ్రీలీల హాజరయ్యారు. దాదాపు 4వేలకు పైగా రన్నర్లు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాలు, బతుకమ్మలతో పాటు పోలీస్ అశ్వక దళం, డప్పులు, నృత్యాలతో హోరెత్తించారు.