సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంతోపాటు ఓఆర్ఆర్ పరిధి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందన్నారు. అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీరు అవసరముందని అంచనా వేసిన మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ఎస్టీపీలపై జలమండలి ట్రాన్స్మిషన్, రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజీఎం నుంచి మేనేజర్ స్థాయి వరకు క్షేత్రస్థాయిలో అధికారులు ప్రణాళికలు వేసుకుని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. తాగునీటి సరఫరా, కలుషిత నీరు సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ట్యాంకర్లు, అదనపు నీటి కోసం వచ్చే వినతులను పరిగణలోకి తీసుకుని సత్వరమే వాటిని పరిషరించాలని ఆదేశించారు. నీటి సరఫరా, ట్యాంకర్ల రవాణాపై విజిలెన్స్ అధికారులు డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. నగరంలో భూగర్భంలో నీటి మట్టాల స్థాయిపై నివేదిక తయారు చేసి అందించాలని ఎండీ ఆదేశించారు.
సంస్థ పరిధిలో ఉన్న బోర్వెల్స్ పనితీరును పరిశీలించి అవసరమైన చోట యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టమ్ (ఏఎంఎస్) కింద మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఎండీ ఆదేశించారు. నగర వ్యాప్తంగా ప్రస్తుతం 70 తాగునీటి ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. అవసరమైతే అదనపు స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు పొందాలని సూచించారు. అంతేకాకుండా అవసరం మేరకు ట్యాంకర్లు, ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవాలని తెలిపారు. ఫిల్లింగ్ స్టేషన్లలో కరెంటు కోతలు, మోటారు రిపేర్లు, తదితర సమస్యలు తలెత్తినప్పడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికే అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. అన్ని స్టేషన్ల కెమెరాలు ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఎంసీసీ, ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిషరించాడానికి చర్యలు తీసుకోవాలని ఎండీ తెలిపారు. వాటర్ లీకేజీలు, సీవరేజీ ఓవర్ ఫ్లోలను ఎప్పటికప్పుడు పరిషరించేలా చూడాలన్నారు. మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే పునర్మిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. కొంత మంది నల్లాకు మోటార్లతో నీటిని తోడుతున్నట్లు బోర్డు దృష్టికి వచ్చినట్లు, ఇలాంటి వారి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకోవాలని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు ఆదేశించారు. అలాగే ఈ వేసవిలోనే రంజాన్ మాసం ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. మసీదు ప్రాంతాల్లో సీవరేజీ ఓవర్ ఫ్లో లాంటి ఇబ్బందులు లేకుండా డివిజన్కొక మినీ జెట్టింగ్ మిషన్ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ , రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఓఅండ్ఎం, ట్రాన్స్ మిషన్ సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్టీపీలపై సమీక్ష: అనంతరం ఎస్టీపీలపైనా ఎండీ సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. చివరి దశలో ఉన్న ఎస్టీపీల పనుల్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.. అంతర్గత రోడ్లు, లైటింగ్, గార్డెనింగ్, వాల్ పెయింటింగ్ తదితర పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ , ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్బాబు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న సింగూరు ప్రాజెక్టులో భాగంగా పెద్దాపూర్ పంప్హౌజ్ దగ్గరున్న 132కేవీ సబ్స్టేషన్లో టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్వహణ పనులు చేపడుతున్నది. ఈ నిర్వహణ పనులు గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతాయన్నారు. ఈ నేపథ్యంలో షేక్పేట రిజర్వాయర్, భోజగుట్ట (పాక్షిక), బంజారా, ఎర్రగడ్డ రిజర్వాయర్ల ప్రాంతాల్లో (పాక్షిక), బోరబండ రిజర్వాయర్ ప్రాంతాలు (పూర్తిగా), ఖానాపూర్ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్ ఆన్లైన్ సప్లయి ప్రాంతాలలో నీటి అంతరాయం ఉంటుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.