సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎల్లవేళలా సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలి.. ఇది కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) లక్ష్యం. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020 సంవత్సరంలో నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు రూ.971.79 కోట్లు ఖర్చు చేసి737 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఈ మార్గాల్లో 1,13,305 గుంతలు పడగా వాటికి మరమ్మతులు చేశారు. 51 కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియన్ పనులు చేపట్టారు. 737 కిలోమీటర్ల మేర లేన్ మార్కింగ్లు, 352 కిలోమీటర్ల మేర పొడవునా కెర్భ్ పెయింటింగ్లు, 2,501 సైన్బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వేసవి నాటికల్లా 811 కిలోమీటర్ల టార్గెట్ను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదేండ్ల పాటు నిర్వహణలో భాగంగా వచ్చే రెండు సంవత్సరాల పాటు కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే సదరు ఏజెన్సీలు చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మరిన్ని రోడ్లలో సీఆర్ఎంపీ రెండో దశ చేపట్టాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలోనే రెండో దశ సీఆర్ఎంపీ పనులపై స్పష్టత ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించరాదని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన దరిమిలా సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణను పక్కాగా చేపడుతున్నది. గుంతలు లేకుండా చూడడం, మ్యాన్హోళ్ల సమస్యలు, రోడ్లు దెబ్బతినడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. రోడ్ల నిర్వహణ, పనులలో పౌరులను భాగస్వామ్యం చేశారు. రహదారుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పౌరులు సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులు విస్తృత అవగాహన చేపట్టారు. ఇందుకోసం వాట్సాప్, ట్విట్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2245 మంది ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు రూ.18.24 లక్షల జరిమానా విధించారు.