సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన హెచ్ఎండీఏ భూముల పరిరక్షణకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏకు సుమారు 8,457 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములు కోర్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాలు, ఔటర్ రింగు రోడ్డు బయట కూడా ఉన్నాయి. ప్రధానంగా నగర శివారులోని జవహర్నగర్లో ఒక్కచోటే హెచ్ఎండీఏకు 3 వేల ఎకరాల వరకు భూములు ఉన్నాయి. అందులో పెద్ద మొత్తంలో కబ్జాలు కాగా.. మిలిగిన భూములను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. అదేవిధంగా, శంషాబాద్, మియాపూర్, బుద్వేల్, కోకాపేట, వట్టినాగులపల్లి, ఉప్పల్ భగాయత్, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో వందలాది ఎకరాలు భూములు ఉన్నాయి. వీటన్నింటినీ రక్షించేందుకు ఎస్టేట్ విభాగం నుంచి ఏడుగురు సైట్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలోని భూములను నిరంతరం పర్యవేక్షిస్తుండగా, వారికి అదనపు బలంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు సైతం క్షేత్ర స్థాయిలోభూముల రక్షణను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా జానకీరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టగా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా మరో పోలీసు అధికారి తిరుపతి బదిలీపై వచ్చారు. వీరితో పాటు ఎస్ఐ, కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్తో కూడిన పోలీసులు బలగాలు హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఉన్నారు. అమీర్పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో హెచ్ఎండీఏకు ఉన్న భూములను పర్యవేక్షించేందుకు సీఐ, ఎస్ఐలతో పాటు కానిస్టేబుళ్లు సైతం వెళ్లి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని మెట్రోపాలిటన్ కమిషనర్కు నివేదిక ఇస్తున్నారు. భూముల పరిరక్షణ విషయంలో చాలా కచ్చితంగా వ్యవహరించాలని అటు ఎస్టేట్ ఆఫీసర్కు, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీలకు మెట్రోపాలిటన్ కమిషనర్ దాన కిశోర్ ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల భూములున్నాయి, వివాదాలు, కోర్టు కేసులు, కబ్జాలకు అవకాశం ఉన్న భూముల వివరాలను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటున్నారు.
హెచ్ఎండీఏ భూములను ఎవరైనా ఆక్రమించాలని, అక్రమ కట్టడాలు చేపట్టాలని ప్రయత్నం చేసినా వెంటనే అప్రమత్తమై అడ్డుకునేలా చర్యలు తీసుకున్నామని ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉన్నతాధికారి తెలిపారు. స్థలాల వద్ద ఎలాంటి వివాదాలు తలెత్తినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారమిచ్చి, అక్కడికి వెళ్లి పరిస్థితులను చక్కదిద్దేలా ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనిచేస్తుందని తెలిపారు. ఇందుకోసం హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అన్ని పోలీస్ స్టేషన్ల సహకారం తీసుకుంటున్నదని తెలిపారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడమే ప్రధాన కర్తవ్యంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనిచేస్తున్నదన్నారు.