సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో 100 శాతం ఈ-వేస్ట్, బయోమెడికల్ వ్యర్థాల సేకరణ చేపట్టేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బయో మెడికల్ వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ వ్యర్థాలతో కలుపొద్దని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లలో శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేసే దిశగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ-వేస్ట్ రీసైక్టర్లు, బయో మెడికల్ వ్యర్థాల శుద్ధి సంస్థలు, సీఎస్ఆర్ భాగస్వాములతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
బయో మెడికల్ వ్యర్థాల సేకరణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కమిషనర్ తెలిపారు. ఆసుప్రతులు, ఆరోగ్య సంస్థలు నిర్ధేశిత నియమాలు, యూజర్ చార్జీలు పాటించేలా ఏఎంఓహెచ్లతో సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి సర్కిల్లో ప్రత్యేక సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు స్వచ్ఛందంగా ఈ-వేస్ట్ ఇచ్చేలా ప్రోత్సహిస్తామని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. అదనంగా ప్రతి శనివారం, ఆదివారం క్యూర్ పరిధిలోని 300 వార్డుల్లో వార్డు స్థాయి సేకరణ డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు.
సేకరణకు అవసరమైన మౌలిక వసతులు జీహెచ్ఎంసీ అందిస్తుందని, ధరలు, చెల్లిపులు, ప్రోత్సహకాలు పూర్తిగా సంస్థలు పరిధిలోనే ఉంటాయని అదనపు కమిషనర్ రవి కిరణ్ తెలిపారు. విధులో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (హెల్త్) ప్రియాంక అల, శానిటేషన్ అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, రవికిరణ్, పీసీబీ ఎస్ఈ సృజన తదితరులు పాల్గొన్నారు.