హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో(Gachibowli) నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఏసీపీ శ్రీకాంత్(ACP Srikanth) స్పందించారు. సోమవారం ఉదయం 4 గంటలకు డయల్ 100కు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే పోలీసులు హోటల్ రూంకి వెళ్లి చూడగా రూమ్లో బీరు సీసాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని, పోస్ట్మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసీపీ తెలిపారు.
కాగా, హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్లో దారుణం చోటుచేసుకున్నది. ఓ నర్సింగ్ విద్యార్థిని (Nursing Student) అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమెపై లైంగిక చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. గచ్చిబౌలిలోని రెడ్స్టోన్ హోటల్ రూమ్లో ఓ యువతి ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థిని శృతిగా గుర్తించారు.
అయితే గదిలో అంతా రక్తపు మరకలు, మందు బాటిళ్లు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, మృతురాలి బంధువులు హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. శృతి మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. తమ బిడ్డపై లైంగికదాడి చేసి, అనంతరం ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.