ఆదిబట్ల, డిసెంబర్ 25: మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని భయపెడితే.. తనను పెళ్లి చేసుకుంటుందనే ఉద్దేశంతో ఆమెను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి ఆదివారం ఆదిబట్ల పోలీసులు నిర్వహించిన సీన్ రీ కన్స్ట్రక్షన్లో ఒప్పుకున్నాడు. నవీన్రెడ్డిని మూడు రోజలు పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఆదివారం నగరంలోని హస్తినాపురం నుంచి వైశాలి ఇంటి వరకు తుర్కయాంజాల్, మన్నెగూడ వరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. నవీన్రెడ్డి పలు అంశాలను పోలీసులకు వివరించాడు.
వైశాలి తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకునేందుకు చూస్తుండటంతో ఆమెను భయపెట్టి పెళ్లికి ఒప్పించాలని చూసినట్టు చెప్పాడు. కిడ్నాప్ సమయంలో కారులో వైశాలిపై దాడి చేసింది వాస్తవమేనని తెలిపాడు. తాను కూడా ప్రతి దాడి చేసిందని పోలీసులకు తెలిపాడు. ఈ వ్యవహారం ఇంత వరకు దారితీస్తుందని ఊహించలేదని అన్నాడు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. పోలీసులు అన్ని వివరాలను నవీన్రెడ్డి నుంచి సేకరించారు.
కిడ్నాప్ చేయడమే నేను చేసిన తప్పు…
వైశాలి పెళ్లి చూపుల కోసం వేరొకరు వస్తున్నారన్న సమాచారంతోనే ఆమె ఇంటికి వెళ్లినట్లు నవీన్రెడ్డి తెలిపాడు. వైశాలి తనతో తిరిగిన సమయంలో తీసిన ఫొటోలు చూపించి పెళ్లి చెడగొట్టాలని పథకం వేసినట్టు చెప్పాడు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత ఊహించని పరిణామాలు జరిగాయన్నారు. తనతో వచ్చిన కొందరు ఇంటిపై దాడిచేసి అడ్డువచ్చిన వారిని కొట్టారని తెలిపాడు. దీంతో ఆమెను అక్కడి నుంచి ఎత్తుకుపోయి భయపెట్టాలని భావించానన్నారు. ఆమెను కిడ్నాప్ చేయడం నేను చేసిన పొరపాటేనని పోలీసుల ముందు నవీన్రెడ్డి వివరించాడు. కాగా, నవీన్రెడ్డి పోలీస్ కస్టడీ నేటితో ముగియనున్నది. మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరు పర్చనున్నట్టు పోలీసులు తెలిపారు.