బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 1: ‘మన బస్తీ-మన బడి’పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు కావాలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం పద్మారావునగర్లోని మైలార్గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ-మన బడి’పథకం ద్వారా రూ.18.92 లక్షలతో పూర్తి చేసిన పాఠశాలను బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణితో కలిసి మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాలో రూ.44 కోట్ల వ్యయంతో 239 పాఠశాలలను ఎంపిక చేసి, వాటిలో 12 రకాల పనులను అభివృద్ధి చేశామని, గతంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదని ఆయన అన్నారు.
అనంతరం మంత్రి అధికారులతో కలిసి నూతన టాయిలెట్లను, తరగతి గదులను, బెంచీలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇకపై ప్రైవేట్ స్కూళ్లలకు పంపాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇన్చార్జి జీ.పవన్కుమార్ గౌడ్, ముషీరాబాద్ డిప్యూటీ ఈఓ చిరంజీవి, డిప్యూటీ ఐఓఎస్ శ్రీనివాస్ రాజు, పాఠశాల హెచ్ఎం ఉమాదేవి, ఎస్ఎంసీ చైర్మన్ అనురాధ, పద్మారావునగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.బాల్రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఇన్చార్జి హెచ్ఎం
‘మన బస్తీ-మన బడి’పథకంలో భాగంగా మైలార్గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పాఠశాలలో తాగునీటి సదుపాయం, విద్యుత్ మరమ్మతులు, టాయిలెట్లు రిపేరింగ్, అన్ని క్లాస్ రూమ్లలో నూతన ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు సమకూర్చారు. అలాగే, ప్రహరీ నిర్మాణం, చుట్టూ గ్రిల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పాఠశాల భవనానికి కొత్త రంగులు వేయడం లాంటి పనులన్నీ పూర్తి అయ్యా యి. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా పాఠశాల రూపుదిద్దుకున్నది. ప్రస్తుతం 220 మంది విద్యార్థులకు చదువు, ఆట పాటలలో శిక్షణ ఇస్తున్నాము. తల్లిదండ్రులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాని ఇన్చార్జి హెచ్ఎం ఉమాదేవి అన్నారు.
పాఠశాల రూపురేఖలు మార్చేశారు..
‘మేము పార్సిగుట్టలో ఉంటాం. చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రైవేట్ స్కూల్కు పంపించే స్తోమత మాకు లేదు’ మైలార్గూడ ప్రాథమిక పాఠశాలలో మా ఇద్దరు అమ్మాయిలు చదువుతున్నారు. ఆంగ్ల మీడియంలో చక్కటి బోధన అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాల అంటే నమ్మలేని విధంగా ఆరు నెలల్లోనే ఈ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. విద్యార్థులకు కావలసిన అన్నింటిని ఇప్పుడు సమకూర్చారు. మధ్యాహ్నం భోజనం, స్కూల్ యూనిఫారాలు, కంప్యూటర్ క్లాస్లు అన్ని బాగున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి మా తల్లిదండ్రులందరి తరఫున ధన్యవాదములు.
– అనురాధ, ఎస్ఎంసీ చైర్మన్, మైలార్గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల