నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమన్న విషయం స్పష్టమవుతున్నది. మోటారు సైకిల్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఒక చేయి లేదు. కృత్రిమ చేతితో డ్రైవింగ్ చేశాడు. చిన్న వాహనమైనా.. ముగ్గురు వ్యక్తులు కూర్చొని వేగంగా దూసుకువెళ్తున్నారు. హెల్మెట్ కూడా ధరించలేదు. నిర్లక్ష్యంగా, నిబంధనలు పాటించకుండా మోటారు సైకిల్ నడిపించి ప్రమాదానికి గురయ్యారు. రెప్పపాటులో ఆ ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మైలార్దేవ్పల్లి, జూలై 4 : శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాశ్రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన షేక్ ఖమ్రుద్దీన్ (35), సయ్యద్ జమీల్ (22), సయ్యద్ బబ్లూ (27) హైదరాబాద్కు వచ్చి లంగర్హౌస్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి శనివారం అర్ధరాత్రి టీవీఎస్ ఎక్సెల్ 100 మోటారు సైకిల్పై చాంద్రాయణగుట్ట నుంచి ఆరాంఘర్ మీదుగా వేగంగా, రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా రహదారి మధ్య నుంచి దూసుకువెళ్లారు. మితిమీరిన వేగంతో వాహనం అదుపుతప్పింది. వాహనం నడిపిస్తున్న షేక్ ఖమ్రుద్దీన్కు ఎడమ చేయి లేదు. కృత్రిమ చేయి సహాయంతో వాహనం నడిపిస్తున్నాడు. మితిమీరిన వేగం.. కృత్రిమ చేతితో డ్రైవింగ్ కావడంతో వాహనం అదుపుతప్పు ముగ్గురూ రోడ్డుపై ఎడమవైపు పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా సిమెంట్ లోడ్తో వచ్చిన వాహనం రోడ్డుపై పడిపోయిన ఈ ముగ్గురు తలల పైనుంచి వెళ్లింది. దీంతో ప్రమాదస్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసిన పోలీసులు ప్రాథమికంగా నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. వాహనం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఎడమ చేయి లేదని, కృత్రిమ చేతితో వాహనం డ్రైవింగ్ చేశాడని డీసీపీ ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా.. లేదా.. పరిశీలిస్తున్నామన్నారు. ట్రిపుల్ రైడింగ్, నిర్లక్ష్యం డ్రైవింగ్, హెల్మెట్ ధరించలేదు, అతి వేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.