మైలార్దేవ్పల్లి, అక్టోబర్ 6 : విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాటేదాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్డు దర్గా సమీపంలోని శ్రీరామ్కాలనీకి చెందిన దండు శివకుమార్ (25) నిలోఫర్ దవాఖానలో సిస్టం ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. దర్గా సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు.
అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన కంటైనర్ వాహనం శివకుమార్ పైనుంచి వెళ్లడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ ఏవీ ప్రసాద్, సీఐ శ్యాంప్రసాద్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్దేవ్పల్లి సీఐ కె.నర్సింహ తెలిపారు.
తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 6: వేర్వేరు ప్రాంతాల్లో రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. హైటెక్ సిటీ-హాఫీజ్పేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం సుమారు 30-35సంవత్సరాల వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
కాచిగూడ, అక్టోబర్ 6 : కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలోని డబీర్పుర-ఫలక్నుమా రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటు వెళ్తున్న గుర్తుతెలియని వృద్ధురాలు(60)ని రైలు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపారు.