మణికొండ, ఆగస్టు 12 :నగర శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపు తప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. సుచిత్ర రామరాజునగర్కాలనీకి చెందిన కౌస్తాబు(25), జౌడోన్(25), ప్రకాశ్, దీపక్, ఆశిష్ స్నేహితులు. గురువారం కౌస్తాబుకు గండిపేటలోని సీబీఐటీలో బీటెక్ సప్లిమెంటరీ పరీక్ష ఉండటంతో కారులో వీరంతా బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, కొంత సమయం ఉండటంతో స్నాక్స్ తిందామని.. సీబీఐటీ నుంచి ఖానాపూర్ వైపు మళ్లారు. మూలమలుపు వద్ద ముందు వెళ్తున్న ఆటోను తప్పించబోయి అతివేగంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు. ప్రమాదంలో కారు నడుపుతున్న కౌస్తాబు అక్కడికక్కడే చనిపోయాడు. పక్కన కూర్చున జౌడోన్ చికిత్స పొందుతూ మరణించాడు.
ప్రకాశ్, దీపక్, ఆశిష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. నార్సింగి పోలీసులు, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక వైద్యశాలలో చేర్పించారు. నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మిత్రులను కండ్ల ముందే కోల్పోవడంతో తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పేటకు చెందిన ప్రకాశ్ రావు వ్యాపారవేత్త. రామరాజునగర్కాలనీలో ఉంటున్నారు. ఆయన కొడుకు కౌస్తాబు బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు తన కారులో అదేకాలనీకి చెందిన సంజీవ్(డీఈ), ఎబోరాణి(టీచర్) దంపతుల కుమారుడు జౌడోన్తో పాటు మరో ముగ్గురితో వెళ్లాడు. ప్రమాదంలో కౌస్తాబు, జౌడోన్లు మృతి చెందడంతో కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.