నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి, అవినీతికి పాల్పడిన నలుగురు అధికారులను విచారించేందుకు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సోమవారం అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కామారెడ్డి పశువుల ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్యకేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్వాటర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పసుల రఘుపతిరెడ్డి, నల్గొండ వయోజన విద్యాధికారి సంగు గణేశ్ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టుకు పీపీ వాదనలు వినిపించారు. ప్రధాన నిందితులు సయ్యద్ మొహినుద్దీన్, సయ్యద్ ఇక్రమొద్దీన్ను అరెస్టు చేసేందుకు పూర్తి సమాచారాన్ని సేకరించాలని, ప్రైవేటు వ్యక్తులుగా, ఏజెంట్లుగా వీరిద్దరి పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ నిధులు రూ.2.10 కోట్ల ధనం దుర్వినియోగం పట్ల విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 7న ప్రధాన నిందితుడు సయ్యద్ మొహినుద్దీన్ ఇంట్లో సోదాలు నిర్వహించగా..
గొర్రెల పంపిణీకి సంబంధించిన లబ్ధిదారుల జాబితా పత్రాలు, గొర్రెల క్రయ విక్రయానికి వినియోగించిన నిధులకు సంబంధించిన 90 పత్రాలు, గొర్రెల బీమా సర్టిఫికెట్లకు సంబంధించిన బుక్నం.1626, మేడ్చల్- మల్కాజిగిరి పశుసంవర్థక శాఖ జిల్లా అధికారికి 16 గొర్రెల యూనిట్లకు గానూ.. జిల్లా కలెక్టర్ 2023 ఆగస్టులో మంజూరు చేసిన 21 లక్షల వినియోగం, లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పత్రాల సాక్ష్యాధారాలు లభించాయని, వాటన్నింటినీ ఏసీబీ అధికారులు జప్తు చేసినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. వీటన్నింటిపై అధికారుల వివరణ తీసుకోవాల్సి ఉన్నదన్నారు. ప్రజాధనాన్ని చట్ట వ్యతిరేకంగా, ఉద్దేశపూర్వకంగా నకిలీ బినామీ అకౌంట్లను తయారు చేసిన నలుగురు అధికారులు అవినీతికి పాల్పడినట్టు కోర్టుకు తెలిపారు. జనవరి 1, 2024లో అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన అధికారులు.. పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను అదుపులోకి తీసుకోనున్నారు. మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది.