కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 26 : రిజర్వాయర్ల నిర్మాణం, తాగునీటి పైప్లైన్ల పునరుద్ధరణతో కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికీ సమృద్ధిగా తాగునీటిని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం బాలాజీనగర్ డివిజన్ కేపీహెచ్బీ కాలనీ 15వ ఫేజ్లో 150ఎంఎం డయా మంజీరా పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శిరీషాబాబురావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను నిర్మించడంతో పాటు కాలనీలు, బస్తీల్లో పురాతన కాలంనాటి తాగునీటి పైప్లైన్లన్నింటినీ పునరుద్ధరించినట్లు చెప్పారు. తద్వారా ప్రజలందరికీ అవసరాలకు సరిపడా తాగునీటిని అందించే వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు.
అధిక సామర్థ్యం కలిగిన పైప్లైన్లతో భవిష్యత్లో కూడా తాగునీటి ఇబ్బందులుండవన్నారు. కార్యక్రమంలో జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ రవి, మేనేజర్ సలోని, మాజీ కార్పొరేటర్ బాబురావు, ప్రభాకర్ గౌడ్, జీవ, రాంప్రసాద్, సత్యనారాయణ, సావిత్రి, సంతోష్, యాదయ్య, శ్రీకాంత్, ఎజాస్, శ్రీశైలం, శారద తదితరులున్నారు.
పేదింట్లో ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో నియోజకవర్గానికి చెందిన 84 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం 1లక్షా నూటపదహార్లు అందిస్తున్నామన్నారు. అనంతరం లబ్ధిదారులందరికీ అల్ఫాహారాన్ని అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, ముద్దం నర్సింహ యాదవ్, పండాల సతీశ్ గౌడ్, సబీహాబేగం, మాజీ కార్పొరేటర్లు బాబురావు, శ్రవణ్కుమార్ తదితరులున్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని సుపరిపాలనకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం క్యాంపు ఆఫీస్లో ఎమ్మెల్యే సమక్షంలో కూకట్పల్లి డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకల నర్సింగరావుతోపాటు 20 మంది పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను ఫ్లైఓవర్ల నిర్మాణం, తాగునీటి, విద్యుత్ సమస్యల పరిష్కారం, పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి చెందాయన్నారు. పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లతో చేయూతనందించడంతోపాటు పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. ఈ పనులన్నింటినీ కండ్లారా చూసిన వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ తదితరులున్నారు.