మన్సూరాబాద్, మే 5: అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తన భార్య ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. విజయవాడ సుందరయ్యనగర్కు చెందిన కొలిపాక శ్రీనివాసరావు (49), సత్యవతి అలియాస్ జ్యోతి(35) దంపతులు నామాలగుండులో నివాసముంటున్నారు. వృత్తి రీత్యా స్క్రాప్ వ్యాపారి అయిన శ్రీనివాసరావుకు జ్యోతి రెండో భార్య. డ్రైవర్గా పనిచేసే సికింద్రాబాద్ బుద్ధానగర్కు చెందిన ఎడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీ (22)తో జ్యోతికి పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం శ్రీనివాసరావుకు తెలియడంతో ఇద్దరిని మందలించాడు. అయినా వారిలో మార్పు రాలేదు. దీంతో ఇద్దరిని చంపేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇందులోభాగంగా విజయవాడకు మకాం మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి లగేజ్ను కూడా అక్కడికి పంపాడు.
ఈనెల 1న వెళ్లేందుకు సిద్ధమవ్వగా, చివరిసారిగా బన్నీని కలుస్తానంటూ జ్యోతి ప్రాధేయపడటంతో ఇద్దరిని హత్య చేసేందుకు ఇదే అదునుగా భావించాడు. ఈ క్రమంలో బన్నీని ఇంటికి పిలిచారు. బన్నీ ద్విచక్రవాహనంపై, శ్రీనివాసరావు, జ్యోతి మరో బైక్పై ముగ్గురు కలిసి అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలోని కొత్తగూడెం వంతెన వద్దకు చేరుకున్నారు. తమ వెంట తీసుకొచ్చిన మద్యం తాగారు. అనంతరం బన్నీ, జ్యోతి ఏకాంతంగా కలుసుకుంటుండగా శ్రీనివాసరావు వారి తలపై సుత్తెతో కొట్టి.. స్క్రూ డ్రైవర్తో పొడిచి.. దారుణంగా హత్య చేశాడు. కాల్డేటాతో పాటు సీసీటీవీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో పోలీసులు నిందితుడిని గురువారం ఉదయం ఔటర్ రింగ్రోడ్డు వద్ద అరెస్ట్ చేశారు.