సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ 35వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆబాలం గోపాలం తరలివస్తోంది. తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రచురణ కర్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొలువుదీరిన పుస్తకాలు పుస్తక ప్రియులను అలరిస్తున్నాయి. పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలతో పుస్తక వేడుక ఆద్యంతం కోలాహలంగా సాగింది. చిరిగిన చొకా అయినా తొడుకో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుకో, పుస్తకమే ప్రపంచం అనే నినాదాలతో బుక్ వాక్ నిర్వహించారు. పుస్తక ప్రదర్శనను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, కవి కె.శివారెడ్డి, ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్, అరుణోదయ విమలక్క, విజ్ఞాన దర్శిని రమేశ్, అలిశెట్టి ప్రభాకర్ కుమారుడు సంగ్రామ్, కవి యాకుబ్, హైకోర్టు న్యాయవాది వనజ సందర్శించారు.
తెలంగాణలో పఠనాసక్తి పెరిగిందని.. దీనివల్ల పోలీస్ లాఠీలకు పని తగ్గి పుస్తకాలకు డిమాండ్ పెరిగిందని పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త అన్నారు. ప్రతి సంవత్సరం బుక్ ఫెయిర్కు పెరుగుతున్న ఆదరణను చూస్తే పుస్తకాలకు ఉన్న డిమాండ్ అర్థమవుతోందన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ మాట్లాడుతూ ‘పుస్తకాలు చదవండి.. మొకలు నాటండి’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బుక్ ఫెయిర్ కార్యదర్శి సృతికాంత్ భారతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసు, అవంతి కాలేజ్ కరస్పాండెంట్ పాల్గొన్నారు.
దేశంలో ఫాసిజం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి ఇక్బాల్ రాసిన ‘కళ..చెదరని స్వప్నం’ కవిత్వ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నమ్మిన సిద్దాంతాన్ని ఆచరించాలన్నారు. ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఫాసిజం ప్రమాద దశకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు వనమాలి పాల్గొన్నారు.
కమ్యూనిజం అజరామరం అని, అందుకు అక్షరాన్ని ఆయుధంగా మలచాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పిలుపునిచ్చారు. అరిబండి ప్రసాద్ రచించిన ‘అరుణ తార అరిబండి’, ‘అఖిల భారత కిసాన్ సభ’ సంక్షిప్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని అన్నారు. అఖిల భారత రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ చరిత్ర రాయడం అంత సులభమేమీ కాదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అరిబండి లక్ష్మీనారాయణ జర్నలిస్టు భాస్కర్, రైతు సంఘం నేతలు జంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, అరిబండి లక్ష్మీనారాయణ, మనోహర్ అరిబండి, అనిల్ అరిబండి తదితరులు పాల్గొన్నారు.
పుస్తక ప్రదర్శనలో ఉచిత వైఫై సేవలను జూలూరు గౌరీశంకర్, వైఫై నెట్వర్క్ టెలికామ్ శాఖ డీడీ జి.రాజశేఖర్తో కలిసి బుధవారం ప్రారంభించారు. 1 జీబీ డాటా వరకు వాడుకోవచ్చని తెలిపారు.
సిటీ కాలేజ్ తెలుగు విభాగం ఆధ్వర్వంలో ‘రాజ్యంగ నైతికత’ అనే అంశంపై బహు భాషా విద్యార్థి కవి సమ్మేళనం జరిగింది. సిటీ కాలేజ్ విద్యార్థులు, ప్రభుత్వ మహిళా కాలేజ్ బేగంపేట్ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. రాజ్యంగాన్ని పరిరక్షించాలని, రాజ్యంగ విలువలను కాపాడుకోవాలనే సందేశంతో తెలుగు, హిందీ, ఉర్దూ, అంగ్ల భాషల్లో కవితలు వినిపించారు. తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ కోయి కోటేశ్వర్ రావు, తెలుగు సహాయ అచార్యులు డాక్టర్ నీరజలు కవి సమ్మేళనాన్ని సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ వేత్త వారాల ఆనంద్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ ఆధ్వర్యంలో యూనివర్శిటీ విద్యార్థులతో ‘పోయిట్రీ రీడింగ్’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్,ఆధికార భాష సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి, వాగ్గేయకారుడు జయరాజ్ పాల్గొన్నారు.
పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ బుక్ ఫెయిర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం బుక్వాక్ (పుస్తక నడక) నిర్వహించారు. లోయర్ట్యాంక్ బండ్ కనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద బుక్ వాక్ను తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త జెండా ఊపి ప్రారంభించగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంక్, గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహకుడు రాఘవ, బుక్ ఫెయిర్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్లు విద్యార్థులతో కలిసి బుక్వాక్ చేశారు.