సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : మహిళ గర్భస్థ దశలో ఉన్నప్పుడు అందించే ప్రేరణ, సంస్కారమే ఆమెకు పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది.. అలాంటి ఉత్తమ సంతానం కోసం రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘ఆర్యజనని’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈనెల 7న మఠంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వర్క్షాప్ నిర్వహిస్తున్నామని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి శితికంఠానంద తెలిపారు. రామకృష్ణ మఠంలో ఆర్యజనని కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి శితికంఠానంద ఈ విశేషాలను వెల్లడించారు. బిడ్డ గర్భంలో ఉండగా, తల్లిదండ్రులు చేసే పనులు, తీసుకునే జాగ్రత్తలపై ఆ శిశువు భవితవ్యం ఆధారపడి ఉంటుందని, ఉత్తమ సంతానం కలుగడానికి ఎలాంటి పద్ధతులు అవలంభించాలి, అనుసరించాల్సిన మార్గాలను ‘అర్యజనని’ కార్యక్రమం ద్వారా గర్భిణులకు వివరిస్తామన్నారు. ఇప్పటికే ‘మేధ’ పేరుతో ఆర్యజనని బృందం వర్క్షాప్లు నిర్వహిస్తున్నదని, ఇందులో అనుభవజ్ఞులైన వైద్యులు, సైకలాజిస్టులు ఉంటారని తెలిపారు. ఈనెల 7న జరిగే వర్క్షాప్లో ధ్యానం, భజనలు, యోగాసనాలు నేర్పడంతో పాటు బిడ్డ ఎదుగుదలలో వాటి ప్రాధాన్యతను సవివరంగా చెబుతారన్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొనే వారు www.aaryajanani.org వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.