Traffic Challan | శంషాబాద్ రూరల్, జూన్ 20: పెండింగ్ చలాన్ చెల్లించమంటే ఓ యువకుడు ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన మంగళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని పుల్లారెడ్డి స్వీట్ హౌజ్ వెనుక వ్యవసాయ క్షేత్రంలో నివాసముండే ఎండీ ఫసియోద్దీన్ తన ద్విచక్ర వాహనంపై రోడ్డుపైకి వచ్చాడు. అతడి ద్విచక్ర వాహనంపై రూ. 9000 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. చలాన్ చెల్లించాలంటూ పలుమార్లు ట్రాఫిక్ పోలీసులు సూచించినా.. రేపు మాపు అంటూ గడువు తీసుకున్నాడు.
మంగళవారం మరోసారి అతడు పోలీసుల తనిఖీల్లో పట్టుబడటంతో పెండింగ్ చలాన్లు చెల్లించాలని ఆదేశించారు. దీంతో అతడు తన ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించాడు. గమనించిన పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేశారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.