హైదరాబాద్ : ఆమె వివాహిత.. కానీ మరొకరి వలలో పడింది. అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అదొక్కటే కాదు.. అతనితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ.. రాసలీలల్లో మునిగిపోయింది. తెలివిగా అతను కూడా నగ్న వీడియోలను చిత్రీకరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ వీడియోలను బయట పెడుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రియుడిని ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన ఆ వివాహిత.. ఫేస్బుక్లో పరిచయమైన మరో యువకుడితో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించింది. అనంతరం ప్రియుడిని కడతేర్చింది. ఈ ఘోర ఘటన హైదరాబాద్లోని మీర్పేటలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మీర్పేట్కు చెందిన శ్వేతారెడ్డికి వివాహమైంది. అయితే ఆమె ఫేస్బుక్లో బాగ్ అంబర్పేట్కు చెందిన యశ్మ కుమార్ పరిచయమయ్యాడు. యశ్మ వృత్తిరీత్యా ఫోటో గ్రాఫర్. ఇక శ్వేత, యశ్మ మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధం దాకా దారి తీసింది. ఇద్దరూ చాలాసార్లు శారీరకంగా కలిశారు. అంతటితో ఆగకుండా శ్వేతారెడ్డి యశ్మతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేది. ఈ క్రమంలో అతను ఆ వీడియోలను భద్రపరుచుకున్నాడు.
అయితే యశ్మ శ్వేతారెడ్డిని బెదిరింపులకు గురి చేయడం ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే నగ్న వీడియోలను కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకుంటే అక్రమ సంబంధం బయట పెడుతానని వివాహితను బెదిరించాడు.
ఇక యశ్మ వేధింపులు భరించలేని శ్వేతారెడ్డి అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. దీంతో ఫేస్బుక్లో పరిచయమైన కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొంగల అశోక్కు ఫోన్ చేసి.. యశ్మను చంపాలని చెప్పింది. ఈ నెల 4వ తేదీన అశోక్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ తర్వాత శ్వేతా రెడ్డి, అశోక్ కలిసి యశ్మ కుమార్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. యశ్మ తలపై సుత్తితో మోది హత్య చేశారు. అయితే ఈ హత్యను యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు యత్నించారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇక శ్వేతారెడ్డితో పాటు మరో ఇద్దర్నీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.