ఎల్బీనగర్, జూన్ 12: కర్మన్ఘాట్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. సరూర్నగర్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సంతోష్నగర్ దామోదరం సంజీవయ్యనగర్కు చెందిన గండికోట శివ (21), జగదీశ్, శివ ఫ్లవర్ డెకరేషన్ పనులు చేస్తుంటారు. సోమవారం సాగర్ రింగ్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించే శుభ కార్యంలో ఫ్లవర్ డెకరేషన్ పనులు ఉండటంతో బైక్పై ముగ్గురు యువకులు సంతోష్నగర్ నుంచి సాగర్ రింగ్రోడ్డు వైపు బయలుదేరారు. కర్మన్ఘాట్ చౌరస్తాలోని అమరావతి వైన్స్ సమీపంలో ఓ ఆటో, ఆర్టీసీ బస్సు (ఇబ్రహీంపట్నం డిపో)కు మధ్యకు వచ్చారు.
ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి పడిపోయింది. బైక్పై ఉన్న ముగ్గురు కిందపడ్డారు. బైక్ నడుపుతున్న గండికోట శివ రోడ్డుపై పడటంతో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ముందు చక్రం అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు యువకులు జగదీశ్, శివ గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.