Hyderabad | భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఆటో డ్రైవర్ సాయంతో ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. హైదరాబాద్లోని అల్వాల్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. యాప్రాల్కు చెందిన 29 ఏళ్ల మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 12 న (శుక్రవారం) సాయంత్రం అల్వాల్ పోలీస్ స్టేషన్కు బయల్దేరింది. ఇందుకోసం ఆమె ఉబెర్లో ఒక ఆటో ( AP11 TA 0266 ) బుక్ చేసుకుంది. ఆటో రాగానే ఎక్కి అల్వాల్ పీఎస్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆ మహిళపై కన్నేసిన ఆటో డ్రైవర్ పీఎస్ దగ్గరే ఉండిపోయాడు. ఫిర్యాదు చేసి బయటకొచ్చిన మహిళను యాప్రాల్లో దించుతానని ఎక్కించుకున్నాడు. ఆమెను మాటల్లో పెట్టి.. అన్ని వీధులు తిప్పుతూ ఓ వైన్ షాప్ దగ్గర ఆపాడు. అక్కడ మహిళ వద్దని చెబుతున్నా ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు.
ఆ ఇద్దరూ మద్యం తాగుతూ బలవంతంగా ఆ మహిళకు కూడా మందు తాగించారు. అనంతరం ఆటోను అల్వాల్లోని వెంకట్రావ్ లేన్లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి ఒక కారు ఎక్కించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా.. మిగిలిన ఇద్దరూ కారులోనే ఆమెపై అత్యాచారం చేశారు. శనివారం తెల్లవారుజామున 2:45 గంటలకు ఆ ఇద్దరి నుంచి తప్పించుకున్న బాధితురాలు గణేశ్ ఆలయం వద్దకు చేరుకుంది.
అక్కడ స్థానికుల సాయంతో డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని పీఎస్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని.. కేసును అల్వాల్ పీఎస్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు మొదలుపెట్టిన అల్వాల్ పోలీసులు.. ఆటో డ్రైవర్ శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు పరారీలో ఉన్నారు.