Hyderabad | బంజారాహిల్స్,మార్చి 24: సహజీవనం చేస్తు న్న వ్యక్తి వేధింపులను భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తికి చెందిన రెడపాక పల్లవి(27) ఎనిమిదేళ్లుగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఇందిరానగర్లో ఆర్. సదానంద్(31) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు.
కొన్నాళ్ల తర్వాత పల్లవితో సహజీవనం చేస్తూనే ఆమెకు తెలియకుండా శిరీష అనే మహిళను సదానంద్ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా రెండేళ్లుగా పల్లవితో కలిసి ఇందిరానగర్లో మరో ఇల్లు తీసుకుని ఉంటున్న సదానంద్ ఆమెను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అకారణంగా గొడవపడడంతో పాటు తరచూ కొట్టేవాడు. పల్లవి చనిపోతే తాను ఊరెళ్లిపోయి తన భార్యాపిల్లలతో ఉంటానంటూ చెప్పేవాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాత్రి తన తల్లి లక్ష్మికి పల్లవి ఫోన్ చేసి తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చెప్పుకుంది. తనకు బతకాలని లేదంటూ కన్నీటి పర్యంతమైంది. తాము ఊరినుంచి బయలు దేరి వస్తున్నామని, సదానంద్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కాగా గురువారం తెల్లవారుజామున పల్లవి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సదానంద్ వేధింపులతోనే పల్లవి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ 498(ఏ), 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.