మారేడ్పల్లి, జనవరి 10: మద్యం మత్తులో సృ్పహ కోల్పోయిన తల్లి. ఆమె పక్కనే ఎముకలు కొరికే చలిలో 2 నెలల పసికందు ఏడుస్తూ… చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెండు నెలల పాపను చేరదీసి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… మెదక్ జిల్లాకు చెందిన నరేశ్, దుర్గ దంపతులు. వీరికి 4 సంవత్సరాల బాబు, 2 నెలల పాప ఉంది.
అయితే దుర్గ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ కారు పార్కింగ్లో ఉంటూ పిల్లలను పోషించుకొంటోంది. వచ్చిన డబ్బులతో మద్యం సేవించేది. ఈ క్రమంలో ఈ నెల 9న రాత్రి 11 గంటల సమయంలో దుర్గ మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 2 నెలల పాప చలిలో ఏడుస్తూ ఉండటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎస్ఐ అనిల్కుమార్ ఆ చిన్నారిని చేరదీసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం డిశ్చార్జి అయిన చిన్నారిని, 4 సంవత్సరాల బాలుడిని దివ్యదిశ చైల్డ్ లైన్ ప్రతినిధులకు పోలీసులు అప్పగించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చిన్నారికి అవసరమైన మందులు, పాల డబ్బాలు, ఇతరత్ర ఖర్చులు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు కల్యాణి,వెంకటేశ్ సమకూర్చారు. ప్రస్తుతం తల్లి దుర్గ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.