కవాడిగూడ, జూన్ 3: ఓ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాప్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందిన ఘటన దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం…శామీర్పేట అలియాబాద్లో నివాసముంటున్న లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు డి.మనోజ్కుమార్(34) హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ద్విచక్ర వాహనం పై తన నివాసానికి వెళ్తుండగా ట్యాంక్బండ్ పై ఎదురుగా సికింద్రాబాద్ నుంచి అఫ్జల్గంజ్ వైపు వెళ్తున్న సోనీ ట్రావెల్స్కు చెందిన (ఏపీ 04వీ 9735) బస్సు వేగంగా వచ్చి మనోజ్ కుమార్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో మనోజ్కుమార్ ద్విచక్ర వాహనం బస్సు టైర్ల కిందకు దూసుకెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి మనోజ్కుమార్ వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మనోజ్కుమార్ను గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ సయ్యద్ వసీం పాషా(35) పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.