Hyderabad | వెంగళరావునగర్, మే 11 : ఆ దొంగ పోలీసులకు చిక్కినా మస్కా కొట్టి మాయం అవుతాడు.. పోలీసుల కస్టడీలో నుంచి కళ్లుగప్పి మాయం అవుతాడు.. అలా రెండు సార్లు పోలీసులకు చిక్కిన ఒక దొంగ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పోలీసులు అతని జాడను గుర్తించలేకపోయారు. నిందితుడు దేశ సరిహద్దులు దాటేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు మస్కా కొట్టి మధురానగర్ పోలీసుస్టేషన్ నుంచి రెండుసార్లు ఓ దొంగ పారిపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. గతేడాది ఆగస్టులో యాదగిరినగర్ బస్తీ ఇండ్లల్లోని నల్లా ట్యాపులు చోరి చేసే దొంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదే పదే ఇండ్లల్లో నల్లాలు చోరికి గురవుతుండడంతో బస్తీవాసులే దొంగను ఎలాగైనా పట్టుకోవాలని దృఢ సంకల్పంతో ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. దొంగ ఓ ఇంట్లోకి చొరబడి వాటర్ ట్యాపులు కాజేసీ ఉడాయించడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దొంగ చోరి చేసే వీడియోను బస్తీ వాసుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. బస్తీ వాసులంతా చైతన్యవంతులై అప్రమత్తంగా ఉండి గతేడాది ఆగస్టు ఒకటో తేదీన నేపాల్కు చెందిన దొంగ వికాస్ను పట్టుకుని దేహశుద్ధి చేసి మధురానగర్ పోలీసులకు అప్పగించారు.
పోలీసుస్టేషన్లో పోలీసుల కళ్ళు గప్పి నిందితుడు వికాస్ పరారయ్యాడు. అయితే కొద్ది రోజులకే ఓ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని మధురానగర్ పోలీసులకు అప్పగించారు. ఠాణా నుంచి ఆ దొంగ మరోసారి పారిపోయాడు. ఇప్పటికే అతనిపై మధురానగర్ ఠాణాలో పలు కేసులు నమోదయ్యాయి. 9 నెలలు గడిచినా ఆ నిందితుడ్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. చోరి కేసు నిందితుడు వికాస్ ఎప్పుడో దేశ సరిహద్దులు దాటి తన దేశమైన నేపాల్కు వెళ్లి అక్కడే మకాం వేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల పనితీరుపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిందితుడ్ని పట్టుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.