Hyderabad | హైదరాబాద్ : రాయదుర్గం పరిధిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్పై నుంచి దూకి బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మై హోమ్ బుజాలోని జే బ్లాక్లో రేయాన్ష్ రెడ్డి(14) అనే విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రేయాన్ష్ ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం రాత్రి 7:30 గంటలకు రేయాన్ష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎంతకు తిరిగి రాలేదు. దీంతో అర్ధరాత్రి దాటాక 2 గంటలకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మంగళవారం ఉదయం 7 గంటలకు బాలుడి కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పక్క బ్లాక్ ముందు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. గత కొద్ది రోజులుగా విద్యార్థి ఆన్లైన్ గేమ్స్కు బానిస కావడం, చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.