బండ్లగూడ, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : గుడుంబా రహిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ధూల్పేటపై కన్నేసిన గంజాయి స్మగ్లర్లపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి కేంద్రంగా ధూల్పేటకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ.52లక్షల విలువైన 230కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనంతో పాటు రూ.8.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి, అదనపు డీసీపీ రష్మిపెరమాల్తో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. ఏపీలోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన రామకృష్ణ టెన్నిస్ కోచ్. కాగా చెడు వ్యసనాలకు అలవాటుపడిన రామకృష్ణ సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి స్మగ్లర్లకు సహాయకుడిగా పనిచేస్తూ కొంత కాలం తరువాత తానే నేరుగా గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు.
మూడేళ్లుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రామకృష్ణపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదై ఉన్నాయి. పలు మార్లు పోలీసులకు పట్టుబడినా తీరు మారలేదు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా, లంబసింగి ప్రాంతానికి చెందిన కృష్ణ వద్ద 230కిలోల గంజాయి కొనుగోలు చేసి, ధూల్పేటలోని సూర్యరాజ్సింగ్కు సరఫరా చేసేందుకు కారులో నగరానికి బయలుదేరాడు. గురువారం ఉదయం షాబాద్కు చేరుకోగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, షాబాద్ పోలీసులు కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో గంజాయిని తీసుకునేందుకు అక్కడికి వచ్చిన ధూల్పేట, జుమ్మెరాత్బజార్కు చెందిన సూర్యరాజ్సింగ్ను సైతం అదుపులోకి తీసుకున్నారు.