సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్గడ్కు చెందిన మున్సిపల్ శాఖ , టౌన్ప్లానింగ్ అధికారుల బృందం శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో పురపాలక శాఖ అందిస్తున్న సేవలు, సత్వర అనుమతులే లక్ష్యంగా టీఎస్ బీ పాస్ అమలుపై అధ్యయనం చేసేందుకు ఛత్తీస్గడ్ సీనియర్ టౌన్ప్లానర్ కె.కౌర్, టౌన్ప్లానర్ మానవ్ జైన్, అమృత్సర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ప్లానర్ విజయ్కుమార్ల బృందం ఈ నెల 25న నగరానికి వచ్చింది.
తొలి రోజు టీఎస్ బీ పాస్ కార్యాలయాన్ని సందర్శించిన ఈ బృందం రెండో రోజు జీహెచ్ఎంసీని సందర్శించింది. ఈ బృందాన్ని జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్లు స్వాగతించారు. నిర్మాణ రంగ అనుమతుల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశ పెట్టేందుకు తీసుకువచ్చిన టీఎస్ బీ పాస్ అమలు చేస్తున్న తీరును సీసీపీ దేవేందర్ రెడ్డి ఈ బృందానికి వివరించారు. నిర్మాణ రంగ అనుమతుల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సులభతరం ఉందని ఈ సందర్భంగా ఛత్తీస్గడ్ అధికారుల బృందం జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారుల పనితీరును కొనియాడింది.