మెహిదీపట్నం, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని నాంపల్లి నియోజకవర్గం అహ్మద్నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జకీఉల్లాఖాన్ పిలుపునిచ్చారు. గురువారం అహ్మద్నగర్ ఖాజా మాన్షన్ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జకీఉల్లాఖాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, పింఛన్లు, మైనార్టీలకు రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని జకీఉల్లాఖాన్ సూచించారు. కార్యక్రమంలో నేతలు మజహర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.