సుల్తాన్బజార్, జనవరి 31: కోఠిలో కాల్పుల కలకలం చేటుచేసుకున్నది. ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వచ్చిన బట్టల వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి..6 లక్షల నగదు, బైక్ను దోచుకెళ్లారు. అడిషనల్ డీసీపీ ఆనంద్ సుల్తాన్బజార్ ఏసీపీ మైనం మట్టయ్య, సుల్తాన్బజార్ ఇన్స్పెక ్టర్ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రం కోజికోడ్, కొడవల్లి గ్రామానికి చెందిన రిన్షాద్ పీవీ(26) తన సొంత గ్రామంలో రెడిమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి.
బట్టల వ్యాపారం నిమిత్తం ఆరు లక్షల నగదుతో నగరానికి ఈ నెల 7న వచ్చాడు. నాంపల్లి సిటీ కన్వెన్షన్ వద్ద ఉన్న జనతా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. 24 రోజులుగా అక్కడే ఉంటూ చార్మినార్, మదీనాలతో దీవాన్దేవ్డీలో హోల్సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం తిరిగినా..దుస్తులు నచ్చకపోవడంతో తిరిగి తన సొంత గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తన సమీప బంధువు, యజమాని మిషబ్కు ఆరు లక్షల నగదును పంపించేందుకు శనివారం కోఠి బ్యాంక్స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన శాఖ ఏటీఎం వద్దకు తన స్నేహితుడు అమీర్ ద్విచక్రవాహనాన్ని తీసుకొని సుమారు 6.50 నిమిషాల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు.
నగదుతో ఉన్న బ్యాగును దోపిడీ చేసేందుకు ఇద్దరు దుండగులు రిన్షాద్పై రివాల్వర్తో కాల్పులు జరుపగా ఓ బుల్లెట్ మిస్ఫైర్ అయ్యింది. మరో బుల్లెట్ కాలి మోకాలి కింది భాగంలో తాకుతూ కిందపడిపోయింది. దీంతో ఇద్దరు నిందితులు నగదుతో ఉన్న బ్యాగును, బైక్ తాళం చెవిని బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటన జరిగిన కోఠి ఎస్బీఐ ఏటీఎం ప్రాంతాన్ని సందర్శించారు. నిందితులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
కాగా, నిందితులు చప్పల్బజార్లో దొంగిలించిన ద్విచక్రవాహనాన్ని వదిలి.. ఆటోలో కాచిగూడ రైల్వేస్టేషన్కు వెళ్లారు. స్టేషన్లోనే తమ దుస్తులను మార్చుకున్నట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. ఢిల్లీ వెళ్లేందుకు సంపర్క్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాలికి బుల్లెట్ గాయమైన రిన్షాద్ను సుల్తాన్బజార్ ఏసీపీ మైనం మట్టయ్య, ఇన్స్పెక్టర్ నరసింహాలు ఉస్మానియా దవాఖానలో వైద్య చికిత్సలు చేయించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు..వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.