సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతున్నదని, కరోనాకు ముందు పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని, అందుకు నిదర్శనం సోమవారం ఒక్కరోజే 4.40లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేశారని ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీర్పేట మెట్రో స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెట్రో ప్రారంభమై నేటికి 5 ఏండ్లు పూర్తి కాగా, ఇప్పటి వరకు 31 కోట్ల మంది మెట్రో రైలులో ప్రయాణం చేశారని ఆయన తెలిపారు.
ప్రజా రవాణా వ్యవస్థలో గ్రీన్ మొబిలిటీగా ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల 2.4 లక్షల లీటర్ల హైడ్రో కార్బన్స్ ఇంధనం ఆదా అయింది. అదేవిధంగా 21 వేల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను పర్యావరణంలో కలవకుండా అడ్డుకుందని వివరాలను వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు అత్యంత కీలకంగా మారిందని, నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మెట్రోకు అదనంగా కొత్త మెట్రో మార్గాలు రానున్నాయని, అవి వస్తే హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలోనే మెట్రో అత్యంత మెరుగైన రవాణా సాధనంగా మారుతుందని చెప్పారు. మొత్తంగా మెట్రో రైలు ప్రాజెక్టును కాలుష్య రహిత ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.