సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ద్విచక్రవాహనాలను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 23 ద్విచక్రవాహనాలు, ప్రింటర్, ల్యాప్టాప్, నకిలీ రిజిస్ట్రేషన్ కార్డులు తదితరాలను సీజ్ చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్లోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్బాబు కేసు వివరాలను వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున ఉప్పల్ పోలీసులు నాగోల్రోడ్, ఎస్వీఎం గ్రాండ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పద స్థితిలో మోటార్సైకిల్పై అటుగా వెళ్తున్న సికింద్రాబాద్లోని సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన రాయుడు చైతన్యసాయికుమార్ను ఆపి తనిఖీ చేశారు.
అయితే వివరాలు చెప్పడంలో తడబడటంతో అనుమానం వచ్చిన పోలీసులు చైతన్యను అదుపులోకి తీసుకొని విచారించగా మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసిన ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్నట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. అతడి వద్ద 23 ద్విచక్రవాహనాలతో పాటు ప్రింటర్, నకిలీ రిజిస్ట్రేషన్కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.