హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని మచ్చబొల్లారంలో విషాదం నెలకొంది. కరోనా మహమ్మారి తమ కుటుంబానికి సోకొద్దనే ఉద్దేశంతో పాలలో నల్ల ఉప్పు కలిపి తాగారు. దీంతో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మచ్చబొల్లారానికి చెందిన సురేశ్, ఆయన భార్య సంధ్య, తల్లి లక్ష్మీ.. కరోనా రాకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. పాలలో నల్ల ఉప్పు కలిపి తాగితే కరోనా రాదని చెప్పాడు.
దీంతో ఈ నెల 9న సురేశ్ దంపతులతో పాటు తల్లి లక్ష్మి పాలలో నల్ల ఉప్పు కలిసి తాగారు. కాసేపటికి భర్త సురేశ్, భార్య సంధ్య, తల్లి లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ముగ్గురికి వాంతులు తీవ్రం కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. మృతుడి భార్య, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.