కొండాపూర్, జనవరి 18 : అంతర్గత రహదారులు అద్దంలా మారనున్నాయి.. కాలనీలు, బస్తీల్లోని రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేకూరనున్నది. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ ప్రేమ్నగర్ కాలనీ అంతర్గత రోడ్ల సమస్యలకు చెక్ పెడుతూ.. రూ. 76 లక్షల వ్యయంతో 960 మీటర్ల పొడవున రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాలనీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ నాటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతుండడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ల కృషితో కాలనీలోని సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతుండడం సంతోషంగా ఉందంటున్నారు. విద్యుత్ సమస్యలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, వరద నీటి సమస్యలు తొలగిపోగా, మిగిలిపోయిన రోడ్ల సమస్య తొలగిపోతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం..
కాలనీలో మిగిలిపోయిన సమస్యగా మారిన అంతర్గత రహదారుల నిర్మాణ పనులతో కాలనీ వాసుల్లో ఆనందం నెలకొన్నది. ఇప్పటికే డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సమస్యలు తీరిపోయాయి. ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సహకారంతో కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది.
సకాలంలో పూర్తి చేసేలా చర్యలు
ప్రేమ్నగర్ కాలనీలో చేపట్టిన అంతర్గత రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పనుల నాణ్యతను పరిశీలిస్తు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నాం. ప్రజా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులలో వేగాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
జగదీశ్, కొండాపూర్, ఏఈ