సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నగరంలో చారిత్రక భవనాల్లో ఒకటైన బేగంపేటలోని పైగా ప్యాలెస్ను తెలంగాణ మ్యూజియంగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్లో కొత్తగా యూఎస్ కాన్సులేట్ భవనం నిర్మాణం పూర్తి కావడంతో, అక్కడికి ఈ కార్యాలయాన్ని మార్చారు. ఇప్పటి వరకు యూఎస్ కాన్సులేట్ సేవలు కొనసాగిన ఈ భవనం ఈ ఏడాది మార్చి నుంచి ఖాళీగా ఉంది. దీంతో బేగంపేటలోని పైగా ప్యాలెస్ భవనాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మొదటి నుంచి ఈ చారిత్రాత్మక భవనాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ంఎడీఏ) ప్రధాన కార్యాలయంగా ఉంది. ఎంతో విశాలమైన పైగా ప్యాలెస్ను అత్యంత కీలకమైన సేవలను అందించేందుకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి ఒక మ్యూజియంను ఏర్పాటు చేస్తే, దానికి ఈ భవనం అన్ని విధాలుగా సరిపోతుందని భావిస్తున్నారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం కోర్ సిటీలో ఉండడంతో ప్రజలు ఇక్కడికి వచ్చివెళ్లేందుకు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. అప్పటి వరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో దీని నిర్వహణను చేపడుతున్నారు. భవనం పరిరక్షణ కోసం ఉన్నతాధికారులు తరచూ సందర్శించడంతో పాటు ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు.
2008 నుంచి బేగంపేటలో యూఎస్ కాన్సులేట్ సేవలు…
తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం చెన్నైకి వెళ్లేవారు. అక్కడికి వెళ్లే వారిలో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎకువ కావడంతో అప్పటి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, హైదరాబాద్లో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. యూఎస్ కాన్సులేట్ కోసం బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న ప్రారంభించారు. స్వాతంత్య్రం పొందిన తరువాత దేశంలో మొదటి అమెరికా దౌత్యపరమైన కార్యాలయం ఇదే కావటం గమనార్హం. అలాంటి కీలకమైన కార్యాలయం కొనసాగిన పైగా ప్యాలెస్ భవనాన్ని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తిరిగి స్వాధీనం చేసుకొని, దాని నిర్వహణను పర్యవేక్షిస్తున్నది.