ఖైరతాబాద్, జూన్ 10: దేశానికి భావిభారత సైనికులను అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పేరేంట్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణారెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ విద్యార్థులు ప్రస్తుత ఏపీ రాష్ట్రంలోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లలో పదేళ్లపాటు ప్రైవేట్ విద్యార్థులుగా అడ్మిషన్లు పొంది చదువును పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు నాన్లోకల్ అంటూ ఏపీకి చెందిన సైనిక్ స్కూల్ సర్క్యులర్ జారీ చేయడంతో ఇక్కడి విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ సైనిక పాఠశాల పేరెంట్స్ అసోసియేసన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాము సాగర్, ఐలయ్య, పోచయ్య ముదిరాజ్, విద్యార్థులు పాల్గొన్నారు.