సుల్తాన్బజార్, ఫిబ్రవరి 29: స్వగ్రామానికి వెళ్తున్నానంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పి.. తన ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎస్ఐ జి.మధుసూదన్ కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సతీశ్ బాబూరావు మీర్జాపురే, కాంచన భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి.. ఇసామియాబజార్లో ఉంటున్నారు. సతీశ్ బాబూరావు లారీ డ్రైవర్. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 25న మధ్యాహ్నం సమయంలో కాంచన(25), కూతురు సాన్వీ(6), కుమారుడు సాయినాథ్(4)ను వెంటబెట్టుకొని.. తన స్వగ్రామమైన మహారాష్ట్రకు వెళ్తున్నట్టు చెప్పి.. ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఇంటికి వచ్చిన సతీశ్ బాబురావుకు భార్యాపిల్లలు కనిపించకపోవడంతో కంగారుపడి.. చుట్టుపక్కల వాకబు చేశాడు. కాంచన ఇద్దరు పిల్లలను తీసుకొని స్వగ్రామం వెళ్తున్నట్లు చెప్పిందని ఇరుగు పొరుగువారు చెప్పారు. దీంతో అతడు మహారాష్ట్రలో ఉన్న బంధువులను తెలుసుకోగా.. అక్కడికి రాలేదని చెప్పారు. పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని ఎస్ఐ మధుసూదన్ తెలిపారు.