Hyderabad | బంజారాహిల్స్: ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతుల గదిలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేసి, వారు దుస్తులు మార్చుకునే దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఇంటి యజమానిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 10 సమీపంలోని హైలం కాలనీలో నివాసముంటున్న సయ్యద్ సలీం (45)కు ఐదంతస్తుల భవనం ఉంది. మొదటి అంతస్తులో కుటుంబంతోపాటు ఉంటున్న సలీం.. మిగిలిన అంతస్తుల్లోని గదులను అద్దెకు ఇచ్చాడు. రెండునెలల కిందట ఇద్దరు యువతులు తమ సోదరుడితోపాటు వచ్చి ఆ ఇంటిలోని ఓ గదిలో అద్దెకు దిగారు. 15 రోజుల కిందట యువతులు ఉంటున్న గదిలో కరెంట్ మీటర్ బాక్స్ అంటూ.. యజమాని ఓ బాక్స్ను పెట్టాడు. అది కరెంట్ హెచ్చుతగ్గులను నియంత్రించే బాక్స్ అని చెప్పాడు. బాక్స్ లోపల చిన్న రంధ్రం చేసి దానిలో సీసీ కెమెరా అమర్చాడు. రోజూ యువతులు బట్టలు మార్చుకునే దృశ్యాలను రికార్డు చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీవీఆర్లో భద్రపరుస్తున్నాడు.
సోమవారం సాయంత్రం అనుమానం వచ్చిన బాధిత యువతి.. తన సోదరుడి సాయంతో బాక్స్ను పరిశీలించగా లోపల కెమెరా ఉన్నట్లు తేలింది. కెమెరాకు ఉన్న వైర్ను పరిశీలించగా.. యజమాని సలీం ఇంట్లోని కంప్యూటర్కు కనెక్ట్ అయినట్లు తేలింది. దీంతో ఆందోళనకు గురైన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఐపీసీ 354(సి), 509తో పాటు 67ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సలీం ఇంట్లో సోదాలు నిర్వహించి, రెండు డీవీఆర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక డీవీఆర్లో యువతులకు సంబంధించిన దృశ్యాలను రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడు సయ్యద్ సలీంను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.