బంజారాహిల్స్,జనవరి 20: విదేశీ జంట ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ను బంజారాహిల్స్ పోలీసులు అరగంట వ్యవధిలోనే గుర్తించి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖతార్కు చెందిన హుస్సేన్(35)తన భార్యతో కలిసి నాలుగురోజుల క్రితం ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్లోని హాలీడే హోటల్లో దిగిన హుస్సేన్ తన భార్యతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం షాపింగ్ కోసం ఆటోలో బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్ నం 1లోని జీవీకే మాల్ వద్ద ఆటో దిగి లోనికి వెళ్లిపోయారు. ఐదు నిమిషాల తర్వాత తమ బ్యాగ్ ఆటోలో మర్చిపోయిన విషయం గుర్తుకువచ్చింది. దాంతో బయటకు వచ్చి చూడగా అప్పటికే ఆటో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
రూ.20వేల నగదుతో పాటు తమ పాస్పోర్టులు, క్రెడిట్ కార్డులతో పాటు విలువైన వస్తువులు కలిగి ఉన్న బ్యాగ్ పోవడంతో వారిద్దరూ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ క్రైం సిబ్బంది పూర్ణచందర్, రాజ్కుమార్, శ్యామ్, శశికాంత్, గిరి తదితరులు రంగంలోకి దిగారు. పోలీస్స్టేషన్లోని ఉన్న సీసీ కెమెరా కంట్రోల్ ద్వారా ఆటో నంబర్ను గుర్తించారు. దారిపొడువునా సీసీ ఫుటేజీలను పరిశీలించడంతో చార్మినార్ వైపు ఆటో వెళ్లినట్లు గుర్తించారు. ఆటోకు సంబంధించిన వివరాలను రాబట్టిన క్రైం పోలీసులు అరగంటలో ఆటోడ్రైవర్ రవి ఫోన్ నెంబర్ను సంపాదించారు. ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ గురించి చెప్పగా దాన్ని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ క్రైం పోలీసుల పనితీ రుపై ఖతార్ యువకుడు హుస్సేన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.