మణికొండ, మే 16 :ఎకరానికి వంద కోట్లకు పైగా విలువ చేసే భూముల మధ్య నివసిస్తున్న ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారని, గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్రెడ్డి మండిపడ్డారు. నార్సింగిలో శనివారం నిర్వహించిన ‘వాక్ ఫర్ వాటర్’ పాదయాత్రలో స్థానిక ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో భారీ ఎత్తున కార్తిక్రెడ్డి నిరసన తెలిపారు. నార్సింగి వాటర్ ట్యాంక్ నుంచి పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు సాగిన ఈ పాదయాత్రలో మహిళలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్తిక్రెడ్డి మాట్లాడుతూ రోజు విడిచి రోజు కూడా తాగునీరు అందక నార్సింగి, బండ్లగూడ, మణికొండ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారన్నారు. బల్క్ కనెక్షన్ల పేరుతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై జలమండలి భారం మోపుతుందని ఆరోపించారు. ఈ ప్రాంతానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్గౌడ్ ప్రజలకు నాలుగురోజులకు ఒకసారి కూడా నీళ్లు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్గౌడ్ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఈ ప్రాంతానికి రావాల్సిన మెట్రోతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని జంట జలాశయాలు చెంతనే ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు గుక్కెడు నీరు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కార్తిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ‘వాక్ ఫర్ వాటర్’ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగిస్తామని కార్తిక్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.విష్ణువర్ధన్రెడ్డి, నియోజకవర్గ మైనార్టీ విభాగం ఇన్చార్జి షేక్ ముక్తార్పాష, మణికొండ పార్టీ నాయకులు సీతారాం దూళిపాళ తదితరులు పాల్గొన్నారు.